-
ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ దారుణ హత్య
-
నిందితుడు టైలర్ రాబిన్సన్ను అరెస్ట్ చేసిన పోలీసులు
-
కిర్క్ ద్వేష ప్రసంగాల వల్లే హత్య చేసినట్లు వెల్లడి
ఛార్లీ కిర్క్ హత్య కేసులో నిందితుడు రాబిన్సన్ గురించి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సన్నిహితుడైన ఛార్లీ కిర్క్ హత్య కేసులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కిర్క్ చేసిన ద్వేషపూరిత ప్రసంగాలు నచ్చకపోవడం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు టైలర్ రాబిన్సన్ ఒప్పుకున్నాడు. వారం రోజుల ముందు నుంచే ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు కూడా నిందితుడు పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు.
గత బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఛార్లీ కిర్క్పై రాబిన్సన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కిర్క్ అక్కడికక్కడే మరణించారు. హత్య జరిగిన 33 గంటల తర్వాత పోలీసులు 22 ఏళ్ల రాబిన్సన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, కిర్క్ ప్రసంగాల్లోని ద్వేషపూరిత వ్యాఖ్యలు తనకు విసుగు తెప్పించాయని రాబిన్సన్ తెలిపాడు. “ద్వేషం నాకు విసుగు తెప్పించింది, కొన్ని ద్వేషాలను పరిష్కరించలేం” అని తన భాగస్వామికి పంపిన సందేశాలు కూడా బయటపడ్డాయి. హత్యకు గల కారణాలను ముందుగానే ఒక నోట్లో రాసిపెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఛార్లీ కిర్క్ స్వలింగ సంపర్కాన్ని, ‘గే’ వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. పురుషులు-పురుషులు, స్త్రీలు-స్త్రీలు పెళ్లి చేసుకోవడం ప్రకృతి విరుద్ధమంటూ బహిరంగ సభల్లో మాట్లాడేవారు. మరోవైపు నిందితుడు రాబిన్సన్ గత ఏడాది నుంచి స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి హక్కులకు మద్దతు ఇస్తున్నాడు.
ఈ నేపథ్యంలో కిర్క్ ప్రసంగాలపై కోపంతోనే రాబిన్సన్ ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాబిన్సన్ లింగమార్పిడి చేసుకున్న వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాబిన్సన్ దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిసింది. అయితే, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో నేరాలు రుజువైతే రాబిన్సన్కి జీవిత ఖైదు లేదా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Read also : MarutiSuzuki : మారుతీ సుజుకీ EV: విక్టోరిస్ కారుకు భారీ డిమాండ్!
